ఈస్టిండియా కంపెనీ


ఈస్టిండియా కంపెనీ : వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
వకార్ ముస్తఫా
బీబీసీ కోసం, లాహోర్ నుంచి
11 నవంబర్ 2020
ప్రతీకాత్మక చిత్రంఫొటో సోర్స్,FRANCIS HAYMAN/NATIONAL PORTRAIT GALLERY, LONDON
అది 16వ శతాబ్దం ముగుస్తున్న కాలం. ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో నాలుగో వంతు వస్తువులు భారత్‌లో తయారవుతుండేవి అప్పటికి. దాంతో, భారత దేశాన్ని 'బంగారు పిచ్చుక'గా వర్ణించేవారు. అప్పుడు దిల్లీలో మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ పాలన కొనసాగుతోంది.

ప్రపంచంలోని అత్యంత సంపన్న చక్రవర్తుల్లో ఆయన ఒకరు. మరోవైపు అదే సమయంలో అంతర్యుద్ధాలతో బ్రిటన్ అట్టుడుకుతోంది. ఆ దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో అక్కడ 3 శాతం మాత్రమే జరిగేది.

ఆ సమయంలో బ్రిటన్‌లో మహారాణి ఎలిజెబెత్-1 పాలన కొనసాగుతోంది. యూరప్ ప్రధాన శక్తులు పోర్చుగల్, స్పెయిన్‌లు వాణిజ్యంలో బ్రిటన్‌ను దాటి వెళ్లిపోయాయి. బ్రిటన్ సముద్ర దొంగలు వ్యాపారుల్లా పోర్చుగీసు, స్పెయిన్ వాణిజ్య నౌకలను దోచుకునేవారు.

అదే సమయంలో యాత్రికుడు, బ్రిటన్ వ్యాపారి రాల్ఫ్ ఫించ్ హిందూ మహాసముద్రం, మెసపటోమియా, పర్షియన్ గల్ఫ్, ఆగ్నేయాసియా వ్యాపార యాత్రలు చేస్తున్న సమయంలో భారత ఎంత సంపన్న దేశమో తెలిసింది.

రాల్ఫ్ ఫించ్ యాత్ర ఎంత సుదీర్ఘంగా సాగిందంటే, ఆయన అది ముగించుకుని బ్రిటన్ వెళ్లేలోపు రాల్ఫ్ చనిపోయాడనుకుని ఆయన వీలునామాను కూడా అమలు చేశారు.

తూర్పు నుంచి మసాలాల వ్యాపారం చేయడానికి లెవెంట్ కంపెనీ అప్పటికే రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది.

భారత్ గురించి రాల్ఫ్ ఫించ్ ఇచ్చిన సమాచారంతో సర్ జేమ్స్ లాంక్‌స్టర్‌తోపాటూ 200 మందికి పైగా బలమైన, బ్రిటన్ పారిశ్రామికవేత్తలు భారత్ దిశగా ముందుకెళ్లాలని ఆలోచించారు. ఆ కంపెకి చాలా పేర్లున్నాయి. కానీ అది ఈస్టిండియా కంపెనీ పేరుతో పాపులర్ అయ్యింది.

మొదట్లో మిగతా ప్రాంతాల నుంచి యాత్రలు చేసిన కెప్టెన్ విలియమ్ హాకిన్స్ 1608 ఆగస్టు తర్వాత భారత్‌లోని సూరత్ రేవులో తన నౌక 'హెక్టెర్‌'కు లంగరు వేశారు. వాణిజ్యం కోసం ఈస్టిండియా కంపెనీ వచ్చినట్లు ప్రకటించారు.

బ్రిటన్ వాణిజ్య ప్రత్యర్థులు డచ్, పోర్చుగీసు నౌకలు అప్పటికే, హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. కానీ, ఈ కంపెనీ, దానికంటే 20 రెట్లు పెద్దది, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన భారతదేశంలో ప్రజలపై నేరుగా రాజ్యం చేయబోతోందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు.

అప్పటికి అక్బర్ చక్రవర్తి చనిపోయాడు. ఆ కాలంలో సంపద విషయానికి వస్తే, అక్బర్‌కు సమానంగా చైనా మింగ్ రాజవంశం మాత్రమే ఉండేది.

ఖాఫీ ఖాన్ 'నిజాముల్-ముల్క్ ముంత్‌ఖబుల్-బాబ్' పుస్తకంలో అక్బర్ అప్పటి సంపద వివరాలు రాశారు. ఆ సమయంలో అక్బర్‌ తన వారసుల కోసం ఐదు వేల ఏనుగులు, 12 వేల గుర్రాలు, వెయ్యి చిరుతలు, పది కోట్ల రూపాయలు, వంద తులాల నుంచి 500 తులాల వరకూ పెద్ద పెద్ద బంగారు నాణేలు. 272 మణుగుల(3 వేల కిలోలకు పైనే) ముడి బంగారం, 370 మణుగుల(4 వేల కిలోలకు పైగా) వెండి, అప్పట్లో 3 కోట్ల రూపాయల విలువ చేసే ఒక మణుగు(11 కిలోలకు పైనే) ఆభరణాలు వదిలి వెళ్లారు.

ఈస్టిండియా కంపెనీ అధికారి లార్ట్ క్లైవ్‌కు బెంగాల్ మొత్తం దీవాన్ హక్కులు అప్పగిస్తున్న మొఘల్ చక్రవర్తి ఆలం 2
ఫొటో సోర్స్,BENJAMIN WEST/BRITISH LIBRARY
ఫొటో క్యాప్షన్,
ఈస్టిండియా కంపెనీ అధికారి లార్ట్ క్లైవ్‌కు బెంగాల్ మొత్తం దీవాన్ హక్కులు అప్పగిస్తున్న మొఘల్ చక్రవర్తి ఆలం 2

జహంగీర్ శకం
నూరుద్దీన్, జహంగీర్ బిరుదులతో అక్బర్ కొడుకు సలీమ్ మొఘల్ సింహాసనంపై కూర్చున్నాడు. రకరకాల సంస్కరణలు అమలు చేసిన ఆయన ముక్కు, చెవులు కోయడం, చేతులు నరకడం లాంటి శిక్షలు రద్దు చేశాడు.

మద్యం, మిగతా మత్తు పదార్థాలు ఉపయోగించడం(సామాన్యులు), ప్రత్యేక రోజుల్లో పశువులను వధించడాన్ని నిషేధించాడు. అక్రమ పన్నులు కూడా తొలగించాడు.

రోడ్లు, బావులు, ధర్మశాలలు నిర్మించిన జహంగీర్ వారసత్వ చట్టాలు కఠినంగా అమలయ్యేలా చూశాడు.

ప్రతి పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించాలని ఆదేశించాడు. ఫిర్యాదుల కోసం మహలు గోడలపై ఒక ధర్మ గంటను వేలాడదీశారు.

40 లక్షల సైనికులున్న మొఘల్ సైన్యంతో అప్పట్లో యూరప్‌లో చేసిన విధంగా యుద్ధాలు చేయలేమనే విషయం సూరత్ రేవులో దిగిన హాకిన్స్‌కు త్వరలోనే తెలిసొచ్చిందని ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం డెల్రింపల్ రాశారు.

కానీ, అతడికి వ్యాపారం చేయాలంటే మొఘల్ చక్రవర్తి అనుమతితోపాటూ, ఆయన సహకారం కూడా అవసరం. హాకిన్స్ ఏడాదిలోనే మొఘల్‌ల రాజధాని ఆగ్రా చేరుకున్నారు. పెద్దగా చదువుకోని హాకిన్స్ జహంగీర్ నుంచి వాణిజ్య అనుమతులు సాధించలేకపోయారు.

ఆ తర్వాత బ్రిటన్ సభలో సభ్యుడు, రాయబారి అయిన సర్ థామస్ రోను రాయబారిగా భారత్ పంపించారు. ఆయన 1615లో ఆగ్రా చేరుకున్నారు. చక్రవర్తికి విలువైన కానుకలు బహుమతిగా ఇచ్చారు. వాటిలో వేటకుక్కలు, జహంగీర్‌కు ఇష్టమైన మద్యం కూడా ఉంది.

బ్రిటన్‌తో సంబంధాలకు జహంగీర్‌ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చక్రవర్తి ఎప్పుడూ వ్యాపారానికి బదులు గుర్రాలు, కళాకృతులు, మద్యం గురించే మాట్లాడేవారని థామస్ రో చెప్పారు. మూడేళ్లు ఆయనకు విధేయతలు చూపించాక, థామస్ రో వాణిజ్య అనుమతులు దక్కించుకోగలిగారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఈస్టిండియా కంపెనీతో ఒక వ్యాపార ఒప్పందంపై సంతకం చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం భారత ఉపఖండంలోని అన్ని రేవుల్లో క్రయవిక్రయాల కోసం కొన్ని ప్రాంతాలు ఉపయోగించుకోడానికి ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటన్‌ వ్యాపారులకు అనుమతి లభించింది. బదులుగా యూరప్ ఉత్పత్తులను భారత్‌లో విక్రయించాలని వారిని కోరారు.

కంపెనీ తమ నౌకల్లో రాజమహలు కోసం తీసుకువచ్చే అన్ని వస్తువులు, బహుమతులను సంతోషంగా స్వీకరించాలని చక్రవర్తి నిర్ణయించారు.

మొఘులుల అంగీకారంతో కంపెనీ భారత్ నుంచి పత్తి, నల్లమందు, పొటాషియం నైట్రేట్, తేయాకు కొనుగోలు చేసి వాటిని విదేశాల్లో ఎక్కువ ధరలకు అమ్మేది.

కంపెనీకి ప్రధాన ఆదాయ వనరు వాణిజ్యమే. కొనుగోలు చేసే వస్తువులకు అది వెండి చెల్లించేది. కంపెనీ 1621 నుంచి 1843 మధ్య స్పెయిన్, అమెరికాలో బానిసలను అమ్మిన సమయంలో కంపెనీ భారీగా వెండి సంపాదించింది.

ఫొటో సోర్స్,GETTY IMAGES
ఫొటో క్యాప్షన్,
జహంగీర్ చక్రవర్తి సభలో సర్ థామస్ రో

1670లో ఈస్ట్ ఇండియా కంపెనీ విదేశాల్లో యుద్ధం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి బ్రిటిష్ చక్రవర్తి చార్లెస్-2 అనుమతులు ఇచ్చాడు. బ్రిటిష్ సైన్యం సాయుధ బలగాలు భారత్‌లో మొదట పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వారిని ఎదుర్కుంది. చాలా యుద్ధాలు గెలిచింది. మెల్లమెల్లగా బెంగాల్‌లో తీర ప్రాంతాన్ని తన అదుపులోకి తెచ్చుకుంది.

కానీ, మొఘలులతో వారు 17వ శతాబ్దంలో ఒకే ఒక్కసారి మాత్రమే తలపడ్డారు. 1681లో బెంగాల్‌లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలంగీర్ మేనల్లుడు నవాబ్ షాయిస్తా ఖాన్ అనుచరులు పన్నులు, ఇతర విషయాల్లో కంపెనీ సిబ్బందిని వేధించారు.

దాంతో, ఆ సిబ్బంది నవాబ్‌రై తమ డైరెక్టర్ సర్ చైల్డ్‌ కు ఫిర్యాదు చేశారు. అతడిపై యుద్ధం చేయడానికి తమ సైన్యానికి సాయం కావాలని సర్ చైల్డ్ బ్రిటన్ చక్రవర్తికి లేఖ రాశారు. తర్వాత, 1686లో బ్రిటన్ నుంచి 19 యుద్ధనౌకలు, 600 మంది సైనికులతో ఒక నావికా దళం బెంగాల్ వైపు ప్రయాణించింది.

కానీ, మొఘల్ చక్రవర్తి కూడా కూడా దానికి సిద్ధంగా ఉండడంతో ఆ యుద్ధంలో వారే గెలిచారు. దీనికి ప్రతీకారంగా 1695లో బ్రిటన్ సముద్రపు దొంగ హెన్రీ యెవెరీ ఔరంగజేబు నౌకలు 'ఫతే ముహమ్మద్', 'గులామ్ సవాయీ'లను దోచుకున్నాడు. అప్పట్లో ఆ ఖజానా విలువ దాదాపు ఆరేడు లక్షల బ్రిటిష్ పౌండ్లని చెబుతారు.

ఫొటో సోర్స్,GETTY IMAGES
ఫొటో క్యాప్షన్,
సర్ థామస్ రో దౌత్య ప్రయత్నాల తర్వాత కంపెనీకి సూరత్‌లో స్వతంత్రంగా వ్యాపారం చేసుకోడానికి హక్కులు లభించాయి.

బ్రిటిష్ సైన్యాన్ని నలిపేసిన మొఘల్ సేనలు
"మొఘల్ సైన్యం ఆ యుద్ధంలో బ్రిటన్ సైనికులను ఈగల్లా నలిపేసింది. బెంగాల్‌లో కంపెనీకి చెందిన ఐదు పరిశ్రమలను ధ్వంసం చేసింది. ఆంగ్లేయులను బెంగాల్ నుంచి తరిమికొట్టింద"ని చరిత్రకారుడు విలియం డెల్రింపల్ రాశారు.

సూరత్‌తో కూడా కంపెనీ పరిశ్రమలను మూసేశారు. బొంబాయిలో కూడా ఆంగ్లేయులకు అదే పరిస్థితి ఎదురైంది. కంపెనీ సిబ్బందికి సంకెళ్లు వేసిన సైన్యం నగరమంతా వారిని తిప్పింది. నేరస్థుల్లా అవమానించింది. దాంతో, తమ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు కంపెనీ సిబ్బంది దర్బారులో చక్రవర్తికి క్షమించమని వేడుకోవాల్సి వచ్చింది. హెన్రీ యెవరీపై చర్యలు తీసుకున్న బ్రిటన్ చక్రవర్తి కూడా మొఘల్ చక్రవర్తిని అధికారికంగా క్షమాపణ అడిగాడు.

ఔరంగజేబు ఈస్టిండియా కంపెనీని క్షమించాడు. 17వ శతాబ్దం ద్వితీయార్థంలో ఈస్టిండియా కంపెనీ చైనా నుంచి పట్టు, పింగాణీ పాత్రలు కొనుగోలు చేసేది. వాటికి కూడా వెండి చెల్లించేవారు. చైనాకు అవసరమైన ఉత్పత్తులేవీ కంపెనీ దగ్గర ఉండేవి కావు.

చివరికి కంపెనీ దానికొక ఒక పరిష్కారం వెతికింది. బెంగాల్‌లో గసగసాలు సాగుచేసింది. బిహార్‌లో నల్లమందు తయారీ పరిశ్రమలు ఏర్పాటుచేసింది. ఆ నల్లమందును దొంగచాటుగా చైనాలోకి చేర్చేవారు. అప్పట్లో చైనాలో నల్లమందు వినియోగం చాల తక్కువ. దాంతో, ఈస్టిండియా కంపెనీ చైనా ఏజెంట్ల ద్వారా ఆ నల్లమందును ప్రజల్లోకి చేర్చేది. నల్లమందు ఇచ్చి వారి నుంచి పట్టు, పింగాణీ పాత్రలు కొనుగోలు చేసి భారీ లాభాలు సంపాదించింది.

ఫొటో సోర్స్,EDWARD DUNCAN
ఫొటో క్యాప్షన్,
చైనీయులు నల్లమందు కొనడానికి నిరాకరించినపుడు, బ్రిటన్ నౌక 'నెమెసిస్' కెంటన్ రేవును ధ్వంసం చేసింది.

చైనా పాలకులు ఈ నల్లమందు వాణిజ్యం అడ్డుకోవాలని ప్రయత్నించారు. దేశంలోకి తీసుకొచ్చే నల్లమందును ధ్వంసం చేశారు. దాంతో చైనా, బ్రిటన్ మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. వీటిలో చైనా ఓటమిపాలైంది. తర్వాత, బ్రిటన్ అవమానకరమైన రీతిలో చైనాతో ఎన్నో ఒప్పందాలపై సంతకాలు చేయించింది.

చైనా పాలకులు ధ్వంసం చేసిన నల్లమందుకు బ్రిటన్ పరిహారం కూడా వసూలు చేసింది. ఆ దేశంలో రేవులన్నీ ఆక్రమించింది. హాంకాంగ్‌పై బ్రిటన్ ఆధిపత్యం కూడా అదే సమయంలో జరిగింది.

ఈస్టిండియా కంపెనీ ఆగడాలపై చైనా పాలకులు బ్రిటన్ మహారాణి విక్టోరియాకు ఒక లేఖ రాశారు. నల్లమందు వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి సాయం చేయాలని కోరారు. కానీ, రాణి ఆ లేఖకు ఎలాంటి సమాదానం ఇవ్వలేదు.

ఫొటో సోర్స్,CONTRABAND COLLECTION/ALAMY
ఫొటో క్యాప్షన్,
భారత్‌తో ఈస్టిండియా కంపెనీ నల్లమందు గోదాం

1707లో ఔరంగజేబు మరణం తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాజ్యాల పాలకుల మధ్య వైరం మొదలైంది. ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న కంపెనీ లక్షలాది స్థానికులను తమ సైన్యంలో చేర్చుకుంది.

యూరప్‌లో పారిశ్రామిక విప్లవం రావడంతో యుద్ధ సాంకేతికతలో కంపెనీ నైపుణ్యం కూడా సాధించింది. బలగాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, బలమైన ఈస్టిండియా సైన్యం పాత పద్ధతుల్లో యుద్ధం చేసే మొఘలులు, మరాఠాలు, సిక్కులు, స్థానిక నవాబుల సైన్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ ముందుకెళ్లింది.

1756లో నవాబ్ సిరాజుద్దౌలా భారత్‌లోనే అత్యంత సంపన్న ఆర్థికవ్యవస్థ ఉన్న బెంగాల్ రాజ్యానికి పాలకుడు అయ్యారు. మొఘలుల ఆదాయంలో 50 శాతం ఇక్కడి నుంచే వచ్చేది. బెంగాల్ భారత్‌లోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒక ప్రముఖ వస్త్ర, నౌకా నిర్మాణ కేంద్రంగా ఉండేది.

బెంగాల్ ప్రజలు పట్టు, పత్తి, ఇనుము, పొటాషియం నైట్రేట్‌తోపాటూ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు తయారు చేసి, బాగా సంపాదించేవారు. ఇటు ఈస్టిండియా కంపెనీ కలకత్తాలో తమ కోటలను విస్తరించి, సైనికుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లింది.

దీంతో, కంపెనీ ఇక తమ పరిధిని విస్తరించకూడదని బెంగాల్ నవాబ్ ఆదేశించారు. కంపెనీ ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆయన సైన్యం కలకత్తా మీద దాడి చేసింది. బ్రిటిష్ కోటలను స్వాధీనం చేసుకుంది. యుద్ధంలో పట్టుబడిన వారిని ఫోర్ట్ విలియం నేలమాళిగలో బంధించింది.

కానీ, పాలకుడు కావాలనే కోరిక ఉన్న నవాబ్ సేనాధిపతి మీర్ జాఫర్‌ను ఈస్టిండియా కంపెనీ తమవైపు తిప్పుకుంది. 1757 జూన్ 23న ప్లాసీలో ఈస్టిండియా కంపెనీ, నవాబ్ సైన్యం మధ్య మరోసారి యుద్ధం జరిగింది.

భారీ సంఖ్యలో ఫిరంగులు, మీర్ జాఫర్ నమ్మకద్రోహంతో నవాబ్ ఆ యుద్ధంలో ఓడిపోయాడు. తర్వాత కంపెనీ మీర్ జాఫర్‌ను బెంగాల్ సింహాసనంపై కూర్చోపెట్టింది. అతడి నుంచి తమకు కావల్సినవన్నీ వసూలు చేసేది. భారత్‌లో ఆంగ్లేయుల దోపిడీ యుగానికి అది ఆరంభం.

ఖజానా ఖాళీ అవడంతో మీర్ జాఫర్ ఈస్టిండియా కంపెనీని వదిలించుకోడానికి డచ్ సైన్యం సాయం కోరాడు. 1759లో తర్వాత 1764లో వారితో జరిగిన యుద్ధాల్లో విజయం సాధించిన కంపెనీ బెంగాల్ పాలనా పగ్గాలను నేరుగా తన చేతుల్లోకే తీసుకుంది.

కొత్త కొత్త పన్నులు విధించిన కంపెనీ, బెంగాల్లో సరకులు చౌక ధరలకు కొనుగోలు చేసి వాటిని విదేశాల్లో ఎక్కువ ధరలకు అమ్మేది. చారిత్రక నిపుణులు వజాహత్ మసూద్ దాని గురించి రాశారు.

ఫొటో సోర్స్,GETTY IMAGES
"18వ శతాబ్దంలో ప్రథమార్థంలో బ్రిటన్ వ్యాపారుల వెండి నాణేలు చెల్లించి భారతీయుల నుంచి పత్తి, బియ్యం కొనుగోలు చేసేవారు. ప్లాసీ యుద్దం తర్వాత ఈస్టిండియా కంపెనీ తన ఫైనాన్స్, రెవెన్యూ వ్యవస్థ సహకారంతో భారత్‌తో వాణిజ్యంపై గుత్తాధిపత్యం సాధించింది"..

"భారతీయుల నుంచి లభించే ఆదాయంలో దాదాపు మూడో వంతు భారత ఉత్పత్తుల కొనుగోలుకే ఖర్చు చేయాలని ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. అలా భారతీయులు తాము అందించిన ఆదాయంలో మూడో వంతు కోసం తమ ఉత్పత్తులను వారికే బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చేది" అని తెలిపారు.

"ప్రపంచంలో అన్ని దేశాలకు చెందిన వ్యాపారులు భారత్‌తో వాణిజ్యం చేసేవారు. ఢాకా, ముర్షీదాబాద్ మల్‌మల్‌ను విదేశీయులు నాణ్యమైనది, శ్రేష్టమైనదిగా బావించేవారు. యూరప్‌ దేశాల్లో ఈ రెండు నగరాల మల్‌మల్ చాలా ఆదరణ పొందింద"ని చరిత్రకారులు, విమర్శకులు జర్నలిస్ట్ బారీ అలీగ్ తన 'కంపెనీ కీ హుకుమత్'(కంపెనీ పాలన) పుస్తకంలో రాశారు.

భారత్‌లో మిగతా వ్యాపారాలతో పోలిస్తే, వస్త్ర వ్యాపారం చాలా ఉన్నత స్థితిలో స్థితిలో ఉండేది. భారత్ నుంచి నూలు, ఉన్ని వస్త్రాలు, శాలువాలు, మల్‌మల్, ఎంబ్రాయిడరీ వస్త్రాలను ఎగుమతి చేసేవారు.

అహ్మదాబాద్‌లో తయారయ్యే పట్టు వస్త్రాలు, వాటిపై బంగారు, వెండి జరీ పనులు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. 18వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ఈ వస్త్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అది ఏ స్థాయికి చేరిందంటే బ్రిటన్ ప్రభుత్వం వాటిపై భారీగా పన్నులు విధించాల్సి వచ్చింది.

నేత వస్త్రాలతోపాటూ, లోహ వస్తువుల తయారీలో కూడా భారత్‌ పురోగతి సాధించింది. లోహంతో తయారైన వస్తువులను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ముల్తాన్‌లో నౌకల కోసం ఇనుప లంగర్లు కూడా తయారు చేసేవారు.

అప్పటి భారత్ ఘనత గురించి వర్ణించిన ఒక ఆంగ్లేయుడు "మన పాలనకు ముందు భారతీయులు చాలా ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేవారని, బ్రిటన్‌లో ఎవరికైనా చెప్పి ఒప్పించడం చాలా కష్టం. వ్యాపారులు, సాహసికుల కోసం అక్కడ ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉండేవి. ఆంగ్లేయులు రాకకు ముందు భారత వ్యాపారులు ఎంతో ప్రశాంత జీవితం గడిపేవారని నేను చాలా గట్టిగా చెప్పగలను" అన్నాడు.

ఔరంగజేబు పాలనాకాలంలో సూరత్, అహ్మదాబాద్ నుంచి జరిగే ఎగుమతుల ద్వారా ఏటా 3 లక్షల నుంచి 13 లక్షలు రూపాయల వరకూ ఆదాయం వచ్చేదని చెబుతారు.

ఫొటో సోర్స్,FINE ART IMAGES/HERITAGE IMAGES/GETTY IMAGES
ఈస్టిండియా కంపెనీ ఒక వాణిజ్య కంపెనీ. కానీ, దానికి రెండున్నర లక్షల మంది సైనికులతో ఒక సైన్యం ఉండేది. వ్యాపారంలో ఎక్కడైనా లాభాలు రాకపోతే, అక్కడ సైన్యం రంగంలోకి దిగి పరిస్థితులు కంపెనీకి అనుకూలంగా మార్చేది. తర్వాత 50 ఏళ్లలో ఈస్టిండియా కంపెనీ సైన్యం, భారత్‌లోని చాలా ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకుంది.

కంపెనీకి పన్నులు చెల్లించి, ఆయా ప్రాంతాలను స్థానిక రాజులే పాలించేవారు. ప్రత్యక్షంగా పాలన స్థానిక పాలకుల చేతుల్లో ఉన్నా, ఆ రాజ్యం ఆదాయంలో ఎక్కువ భాగం బ్రిటిష్ ఖజానాలోకి చేరేది. జనం తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని కష్టాలూ భరించేవారు.

1765 ఆగస్టులో ఈస్టిండియా కంపెనీ మొఘల్ చక్రవర్తి షా ఆలంను ఓడించింది. ఆయనకు ఏడాదికి 26 లక్షలు చెల్లించేలా ఒక ఒప్పందం చేసుకుని తూర్పుగా ఉన్న బెంగాల్, బిహార్, ఒడిషాలో ఆదాయం వసూలు చేసుకోడానికి, ప్రజలను నియంత్రించడానికి హక్కులు పొందింది.

ఆ తర్వాత భారత్ మొత్తం కంపెనీ పాలనలోకి వచ్చింది.

"ప్రపంచం దేవుడిది, దేశం చక్రవర్తిది, పాలన కంపెనీది" అని ఆ సమయంలో జనం చెప్పుకునేవారని చరిత్రకారులు సయ్యద్ హసన్ రియాజ్ చెబుతారు.

మొఘలుల పాలన చివరి రోజుల్లో పాలకులు ప్రజలను వేధించి, హింసించి సంపాదించిన సంపదను రాజ పరివారం విలాసాల కోసం ఖర్చు చేసేది. మొఘల్ యువరాజులను సుల్తాన్ అనేవారు. సోమరితనం, , పిరికితనం, విలాసాలతో వారు చెడ్డ పేరు తెచ్చుకున్నారు.

"1948లో నృత్యాలు, సరోద్ మోజుతో అన్నీ దోచిపెట్టిన ఎందుకూ పనికిరాని సుల్తానుల సంఖ్య 2,104కు చేరుకుంది. షా ఆలం కొడుకు అక్బర్ కూడా రాసలీలల్లో తండ్రిని మించిపోయాడు. 18 ఏళ్లకే అతడికి 18 మంది భార్యలు ఉండేవార"ని చరిత్రకారులు డాక్టర్ ముబారక్ అలీ తన 'ఆఖిరీ అహద్ కా ముగలియా హిందుస్తాన్‌' పుస్తకంలో రాశారు.

18వ శతాబ్దంలో 1769 నుంచి 1773 వరకూ బిహార్ నుంచి బెంగాల్ వరకూ కరువుతో అల్లాడిపోయింది. ఈ కరువుతో లక్షల మంది చనిపోయారు. గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన వారిలో మూడో వంతు కడుపు నిండా తిండిలేక చనిపోయారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటూ గ్రామీణులు కంపెనీ భారీ పన్నులు చెల్లించలేకపోయారు. బెంగాల్ కరవు మానవ కారకం అని నోబెల్ అవార్డు గ్రహీత ఆర్థికవేత్త అమర్త్య సేన్ అన్నారు.

ఇద్దరు రాజుల మధ్య ఘర్షణలు తలెత్తినపుడు ఈస్టిండియా కంపెనీ వారిలో ఒకరికి తన సైన్యం అద్దెకు ఇస్తుండేది. కానీ ఆ సైన్యం ఖర్చులు తడిసి మోపెడవడంతో వారు త్వరలోనే దివాలా తీసేవారు. చివరికి తమ రాజ్యాన్ని కంపెనీకి ధారపోసేవారు.

అలా కంపెనీ, తన పరిధిని విస్తరిస్తూ వెళ్లింది. ప్రకృతి విపత్తులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది. అప్పట్లో రూపాయికి 120 శేర్లు(240 కిలోలు) బియ్యం లభిస్తుండగా, బెంగాల్ కరువు సమయంలో రూపాయికి మూడు శేర్ల(6 కిలోల) బియ్యమే వచ్చేది.

ఒక జూనియర్ అధికారి ఇలాంటి అక్రమాలతో 60 వేల పౌండ్ల లాభాలు సంపాదించాడు. ఈస్టిండియా కంపెనీ మొత్తం 120 ఏళ్ల పాలనాకాలంలో 34 సార్లు ఇలాంటి తీవ్ర కరవు కాటకాలు వచ్చాయి.

మొఘల్ పాలనలో కరువులు వచ్చినపుడు పన్నులు తగ్గించేవారు. కానీ ఈస్టిండియా కంపెనీ కరువులో పన్నులు మరింత పెంచింది. జనం తిండి కోసం తమ పిల్లల్ని కూడా అమ్ముకోవడం ప్రారంభించారు.

ఈస్టిండియా కంపెనీ ఒక ఉద్యోగి షేక్ దీన్ మహమ్మద్ తన యాత్ర గురించి రాస్తూ కంపెనీ పాలన ఎంత భయంకరంగా ఉండేదో చెప్పారు.

ఫొటో సోర్స్,HULTON ARCHIVE/GETTY IMAGES
1780లో మా సైన్యం ముందుకెళ్తున్నప్పుడు, మేం చాలా మంది తీర్థయాత్రికులను చూశాం. వారంతా సీతాకుండ్ వెళ్తున్నారు. 15 రోజుల్లో మేం ముంగేర్ నుంచి భాగల్పూర్ చేరుకున్నాం. మేం నగరం బయట ఒక గుడారం వేసుకున్నాం. ఈస్టిండియా కంపెనీ కెప్టెన్ బ్రూక్, ఆయన సైనికులు అక్కడికి దగ్గర్లోనే కాస్త దూరంలో ఉండేవారు"

"ఆయన అప్పుడప్పుడూ కొండలపై ఉండే ఆదివాసీలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ గిరిజనులు భాగల్పూర్ రాజమహల్ దగ్గర కొండ ప్రాంతాల్లో ఉండేవారు. అటు నుంచి వెళ్లే యాత్రికులను వేధించేవారు. కెప్టెన్ బ్రూక్ ఆదివాసీల్లో చాలా మందిని పట్టుకుని దారుణంగా శిక్షించేవాడు. కొండలపై ఉన్న మిగతా ఆదివాసీలకు కనిపించేలా, పట్టుబడినవారిని ఉరితాళ్లకు వేలాడదీసేవాడు".

"మేం రాజమహల్ చేరుకుని అక్కడే కొన్ని రోజులు ఉన్నప్పుడు, వెనక నుంచి కొంతమంది గిరిజనులు మా వ్యాపారులపై దాడి చేశారు. మా మూడు ఏనుగులు, చాలా ఒంటెలు, ఎద్దులు తీసుకెళ్లిపోయారు. దాంతో మా దళాలు వారున్న ప్రాంతాలపై దాడులు చేశాయి. వారు ఉపయోగించిన కత్తి దాదాపు ఆరు కిలోల బరువు ఉండేది. వారిలో చాలా మందిని పట్టుకుని ఉరికంబానికి వేలాడదీశాం అని చెప్పారు".

టిప్పు సుల్తాన్ ఒక్కడే
మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ఒక్కడే ఫ్రెంచి వారి సాంకేతికత సాయంతో కంపెనీని ఎదుర్కొన్నాడు.

రెండు యుద్ధాల్లో ఓడించాడు కూడా. కానీ భారత మిగతా పాలకులను తమవైపు తిప్పుకున్న ఆంగ్లేయులు టిప్పు సుల్తాన్‌ను కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు.

కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీకి 1799లో టిప్పూ సుల్తాన్ చనిపోయాడనే వార్త తెలీగానే, ఆయన తన గ్లాసును గాల్లోకి ఎత్తి "ఈ రోజు చావుకు మనం భారత్‌లో సంబరాలు చేసుకుందాం" అన్నారు.

లార్డ్ వెల్లెస్లీ పదవీకాలంలో కంపెనీ విజయాలు సాధించినా, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. దాని అప్పులు 3 కోట్ల పౌండ్లకు మించి పోయాయి. కంపెనీ డైరెక్టర్ వెల్లెస్లీ పెట్టే ఖర్చుల గురించి బ్రిటన్ ప్రభుత్వానికి తెలీడంతో ఆయన్ను తిరిగి బ్రిటన్ రప్పించారు.

1813లో బ్రిటిష్ పార్లమెంట్ భారత వాణిజ్యంపై ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యానికి అంతం పలికింది. భారత్‌లో వ్యాపారం చేయడానికి, కార్యాలయం తెరవడానికి మిగతా వ్యాపారులకు అనుమతులు ఇచ్చింది.

పారిశ్రామిక విప్లవం తర్వాత బ్రిటన్‌లో తయారైన బట్టలు భారత్‌లో ఎందుకు అమ్ముడవడం లేదని 1820లో మద్రాస్ గవర్నరుగా పనిచేసిన థామస్ మన్రోను బ్రిటన్ సభ అడిగింది. భారత్‌లో తయారయ్యే వస్త్రాలు వీటికంటే ఎంతో నాణ్యంగా ఉంటాయని ఆయన జవాబిచ్చారు.

కానీ బ్రిటన్‌లో తయారైన బట్టలకు జనాదరణ తీసుకురావడానికి శతాబ్దాల నాటి స్థానిక బట్టల పరిశ్రమను ధ్వంసం చేశారు. దాంతో 1815లో 25 లక్షల పౌండ్లు ఉన్న బ్రిటన్ ఎగుమతులు, 1822 నాటికి 48 లక్షలకు పెరిగాయి.

వస్త్ర తయారీకి ప్రధాన కేంద్రంగా ఉన్న ఢాకా జనాభా లక్షన్నర నుంచి 20 వేలకు తగ్గిపోయింది. గవర్నర్ జనరల్ విలియంబెంటింగ్ తన 1834 రిపోర్టులో "ఆర్థికశాస్త్ర చరిత్రలో ఇలాంటి క్లిష్ట పరిస్థితికి వేరే ఎలాంటి ఉదాహరణ దొరకదు. నేత కార్మికుల ఎముకలతో భరత భూమి తెల్లగా మారిపోయింది" అని రాశారు.

ఫొటో సోర్స్,AFP
రైతుల ఆదాయంపై 66 శాతం పన్నులు విధించారు. మొఘలుల కాలంలో అది 40 శాతం ఉండేది. ఉప్పు సహా నిత్యావసర వస్తువులపై కూడా పన్నులు వేసేవారు. దాంతో ఉప్పు వినియోగం సగానికి తగ్గిపోయింది. పేదల ఆరోగ్యంపై ఆ ప్రభావం పడింది. ఫలితంగా కలరా లాంటి వ్యాధుల వల్ల మరణాలు గణనీయంగా పెరిగాయి.

"బ్రిటన్ తమ దేశంలో తయారైన వస్తువులను అమ్ముకోడానికి పారిశ్రామిక దేశంగా ఉన్న భారత్‌ను వ్యవసాయంపై ఆధారపడే దేశంగా మార్చేసింద"ని ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్ హెన్రీ జార్జ్ టకర్ 1823లో రాశారు.

1833లో బ్రిటిష్ సభ ఒక చట్టాన్ని ఆమోదించి ఈస్టిండియా కంపెనీ వ్యాపార హక్కులను రద్దు చేసింది. దానిని ప్రభుత్వ కార్పొరేషన్‌గా మార్చేసింది.

విలియం డెల్రింపల్ తన పుస్తకం 'ద అనార్క్, ద రిలెంట్‌లెస్ రైజ్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ'లో "ఇది కంపెనీ దారుణ చరిత్రకు ఒక వింత ఉదాహరణ. 18వ శతాబ్దం మధ్యలో ఒక ప్రైవేటు కంపెనీ పదాతిదళం, నావికాదళం సాయంతో 20 కోట్ల జనాభా ఉన్న ఒక దేశాన్ని తన బానిసగా మార్చుకుంది" అని రాశారు.

కంపెనీ రోడ్లు నిర్మించింది, వంతెనలు, ధర్మసత్రాలు నిర్మించింది. రైళ్లు నడిపింది. కానీ విమర్శకులు మాత్రం ఈ పథకాల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు వచ్చినప్పటికీ, వాటి వెనుక అసలు ఉద్దేశం మాత్రం పత్తి, పట్టు, నల్లమందు, చక్కెర, మసాలా వ్యాపారాలను పెంచుకోవడమే అని చెబుతారు.

1835లో చట్ట ప్రకారం ఇంగ్లిష్ భాష, సాహిత్యంను ప్రోత్సాహించేందుకు నిధులు కూడా కేటాయించారు. 1857లో స్వతంత్ర సంగ్రామం(కంపెనీ దృష్టిలో తిరుగుబాటు) సమయంలో కంపెనీ వేలాది మందిని మార్కెట్లలో, రోడ్లపై వేలాడదీసి చంపేసింది. చాలా మందిని అణచివేసింది.

బ్రిటిష్ వలస చరిత్రలో ఇది అతిపెద్ద మారణహోమం. స్వతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత సంవత్సరం బ్రిటన్ మహారాణి విక్టోరియా కంపెనీ అధికారాలకు తెరదించారు. పాలనా పగ్గాలు నేరుగా తన చేతుల్లోకి తీసుకున్నారు. కంపెనీ సైన్యం బ్రిటిష్ సైన్యంలో విలీనం చేసి, నావికాదళాన్ని రద్దు చేశారు.

లార్డ్ మెకాలే వివరాల ప్రకారం కంపెనీ మొదటి నుంచి వ్యాపారంతోపాటూ రాజకీయాల్లో కూడా భాగస్వామిగా ఉంటూ వచ్చింది. అందుకే ఈస్టిండియా కంపెనీ 1874 వరకూ ఊపిరి పీల్చగలిగింది.

అదే ఏడాది బ్రిటన్ వార్తాపత్రిక 'ద టైమ్స్' జనవరి 2 ఎడిషన్‌లో "మానవ జాతి చరిత్రలో ఎవరూ కనీసం ఊహించలేని విధంగా కంపెనీ ఇదంతా చేసింది. రాబోవు ఏళ్లలో ఎవరూ ఇంత దారుణాలకు పాల్పడే అవకాశం లేదు" అని రాసింది. భారత్ ఆ సమయంలో బ్రిటన్ మహారాణి పాలనలో ఉంది.

ఇవి కూడా చదవండి:

జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
కరోనావైరస్‌‌: తెలంగాణ, బీహార్‌, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌‌పై కేసు
కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’


Comments